20, ఆగస్టు 2009, గురువారం

ప్లేటో మహోన్నత భావాలు

"భూతల స్వర్గము" ( ఉటోపియా ) ఆతని తీపికల. ఆ కలను సాకారం చేసుకునేటందులకై ఆతడు ఎంతో శ్రమించాడు. పాశ్చాత్య దేశములలోని తత్వ శాస్త్రములకు ఆది గురువు వంటి ప్లేటో క్రీస్తు పూర్వము 427 లో జన్మించాడు. ఏథెన్సు నివాసి అయిన ఈతని విశ్వ విఖ్యాత రచన"ది రిపబ్లిక్". రచనా శైలిలో పూర్తి విభిన్నతను రంగరించుకున్నది"ది రిపబ్లిక్". కావ్యవేదికపైన ఒక సరికొత్త శైలిని అంకురార్పణ చేసింది ఈ ఉద్గ్రంథం.

గురువు ప్లేటో, తన శిష్య పరమాణువులకు కలిగిన సందేహాలను తీర్చుతూండే వాడు. అలా వారి మధ్య జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమములు అన్నీ, పూస గుచ్చినట్లుగా, ప్రతి సన్నివేశమునూ అక్షరబద్ధం చేయబడి,"ది రిపబ్లిక్"గా విద్యావేత్తలకూ, సామాజిక ప్రగతికాంక్షా పరులకూ అమూల్య వరంగా ఒనగూడినది. చర్చరూపంలో, సంభాషణా శైలితో సమకూర్చబడిన ఈ గ్రంథమును చదివితే, "శాస్త్ర, శాస్త్రీయ, పరిశోధనా గ్రంథాలను కూడా, ఏకబిగిని చదివించగల శక్తి గలది ఈ శైలి" అని బోధపడుతుంది. "Philosophers should be kings".

ప్లేటో తాత్విక గురువైన సోక్రటీసు మరణానంతరం, ప్లేటో దేశాటన చేసాడు. "భూతల స్వర్గము" (ఉతొపీ) ఆతని తీపికల. ఆ కలను సాకారం చేసుకునేటందులకై ఆతడు ఎంతో శ్రమించాడు. అతడు మెగారా నగరానికి వెళ్ళి, ఇటలీ, సైరీని, సిసిలీ, ఈజిప్టు ఇత్యాది పరిసర దేశాలలో పర్యటించాడు.

'ఏథెన్సు' లో 388 B.C. లో యూనివర్సిటీని నెలకొల్పాడు. ఆ విశ్వవిద్యాలయము తర్వాతి
తరాలవారికి, విద్యాలయాల రూపకల్పనకు మార్గదర్శకము ఐనది. ప్లేటో తన మధుర
"యుటోపియా"ను సాకారం చేసుకోవడానకై ఎంతో పరితపించాడు. కానీ, తన ఆదర్శాలను
అమలు చేయడంలో విఫలమైనాడు. తదుపరి, ఆ లక్ష్య సాధనకై విరామము ఎరుగని శ్రమ, కృషిలతో కొనసాగిన ఆయన జీవనయానము, ఆతని 60వ ఏట, 348 A.D.లో అస్తమించినది.
ప్లేటో ఉద్గ్రంథాల తీరు తెన్నులలో కొన్ని ముఖ్యాంశాలు గోచరిస్తాయి. తాను చెప్ప దలుచుకున్న అంశాన్ని పాఠకుల మీద బలవంతంగా రుద్దాలని యత్నించడు. "దీనినే ఖచ్చితంగా మీరందరూ ఆచరించి తీరాలి" అని పట్టు బట్టడు. "ఇదే అంతిమ సిద్ధాంతము" అంటూ, నిర్ధారణ చేసే స్వభావం కాదు అతనిది.

నిజమే కదా! ఏ భావ జాలమైనా ఆచరణాత్మకమైనవి అయితేనే, అందరి చేత ఆమోదించబడతాయి. ఒక వేళ గురువులు గానీ,
నాయకమ్మన్యులు గానీ వెలిబుచ్చిన అభిప్రాయాలూ, ఆదర్శాలున్నూ, స్వాభావికతతో,
సమాజంలోని జనుల మనుగడ యొక్క భద్రతకు మద్దతునూ, హామీని ఇచ్చినంతవరకే అవి అన్నీ ప్రజామోదాని పొందుతాయి. అప్పుడే కాలానికి ఎదురీది, కాలక్రమేణా అవి ప్రజాబాహుళ్యము చేత నీరాజనాలు పొందుతాయి. ఈ వాస్తవమును గుర్తించిన ప్లేటోను తత్త్వవేత్తయే కాదు, గొప్ప మానసిక తత్వజ్ఞుడు అని కూడా చెప్ప వచ్చును. దేనినీ "ఇతమిత్థము" అని అంటూ ఆజ్ఞాపించడు, తీర్పును ఇవ్వడు. తుది నిర్ణయాన్ని యావత్తూ చదువరి బుద్ధిని పదును పెట్టే పద్ధతిలో అట్టి పెట్టేస్తాడు. వాదనలు, ఖండన మండన రూపంలో సాగుతూండే సంభాషణలు, గ్రంథ రూపమును పొందాయి. మధుర కావ్య ఫణితిలో ఉన్న ఈ శైలి, పాఠకుని ఏక బిగిని చదివేలా చేస్తున్నది. కనుకనే, నేటికీ The Republic తాత్వికశాస్త్ర జగత్తులో సుస్థిర స్థానమును పదిలపరచుకున్నది. మనోజ్ఞ సమాజ
నిర్మాణమును వాంఛించే నేతలకు, సంఘ సంస్కర్తలకు, అందు బాటులో 'జఏయ్ గంటలు' ఇవి. ప్లేటో భావాలు రచనా ప్రపంచములో చ్యుతి లేని దివ్య తారలు, మసక వేయని సూర్య బింబ కాంతులు. అవి నిత్యోద్బోధకములు. తత్ స్వభావ ప్రభావం సోకనటువంటి, పాశ్చాత్య
దార్శనికుడు ఒక్కడైనా లేడు."అంటూ హిందూ తాత్విక పరిశీలకులు అభిప్రాయ పడ్డారు. అంతే కాదు! "ఆ 'జేగంటలు' మన భారతీయ దార్శనికులకు ఉపనిషత్తుల వంటివి."అని తలచారు.

ప్లేటో అనంతరం వెల్వడిన తాత్విక సిద్ధాంతాలు యావత్తూ పడమటి సంధ్యా రాగములే! ఆ
మేధావి భావనలకు టుఫ్టీకలే! ప్రొఫెసరు వైట్ హెడ్ ఇలాగ సెలవిచ్చాడు,"యదార్థంగా ఆయా
భావాలను, ప్లేటో రచనలు ఎంత వరకు ప్రతిపాదిస్తున్నవో, అలాగే పాఠకుని బుద్ధీ, ఆలోచనలూ ఆయా భావాలను ఎంత వరకు నిర్ధారిస్తూన్నవో విభజించి తెలియ జెప్పడము కష్ట సాధ్యము."
తత్పూర్వము ఉన్నట్టి పైథాగరస్, ఫార్మనీడ్స్, హిరాక్లిటస్,సోక్రటీసు మున్నగు గ్రీకు తత్వవేత్తల ప్రభావం ప్లేటో మీద అత్యధికంగా ఉన్నది. తనకు పూర్వమే నెలకొని ఉన్న అభిప్రాయ సరళిలోని మంచిని గ్రహించి, తన తదుపరి ప్రపంచానికి అమోఘ గ్రంథరత్నంగా అందీయగలిగాడు ప్లేటో.

"మేలైన సమాజం నిర్మాణమునకు పునాది వంటిది విద్యయే!" అని గ్రహించిన కుశాగ్రబుద్ధి ఐన ప్లేటో మహనీయుడు -"చదువు"గురించి ప్రతిపాదించిన సూక్తి కిరణములను చూద్దాము.
విద్య సంప్రదాయ సిద్ధంగా ఉన్నదే మంచిది, దాని కన్నా మేల్తరమైనది లేదు.

శరీర సౌష్ఠవమునకు అవసరమైనది వ్యాయామము.
ఆత్మానంద పరిణతికై 'సంగీతము,నాట్యము, లలిత కళలు' అత్యంత ఆవశ్యకములు.

విపరీత గుణబోధిత కథలపై, పైత్య ప్రకోపిత భావజాలమను ప్రోత్సాహించే రచయితల యొక్క "చే వ్రాతలపై" ఆంక్షలను విధించడము ప్రథమ కర్తవ్యము. ఈ అభిప్రాయ పరంపర, మన భారతీయ ఆత్మకు సన్నిహితంగా ఉన్నది. చతుష్షష్ఠి కళలను మన దేశములో ఒక కాల్పనిక అవసరముగా గుర్తించారు హిందూ తత్వ వేత్తలు. ముఖ్యముగా మన అలంకార, లాక్షణిక రూప శిల్పులు..కనుకనే వారు, "సంగీతమపి సాహిత్యమ్, సరస్వత్యా స్థన ద్వయమ్ ఏక మాపాత మధురమ్, అన్యదాలోచనామృతమ్" అంటూ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ప్లేటో"ఆరోగ్య పరి రక్షణకూ, తద్వారా మాతృదేశ రక్షణకూ మనుష్యులకు వ్యాయామము తప్పని సరి"అంటూ ఘంటాపథంగా ఎలుగెత్తిచాటాడు. వ్యాయామం విషయంలో, మన పూర్వీకులకూ, ప్లేటో భావములకూ విభిన్నత కాన వస్తూన్నది. సాత్విక రూపములో మలచబడినవి మన వ్యాయామములు. సూర్య నమస్కారములు, యోగాసనములు వంటివి సూత్రీకరించ బడినాయి. అంతే కాదు, అవి నిబద్ధతతో పాటించగల
ఆచారములుగా అనుకూలించ బడి, నిత్య జీవనములో అవిభాజ్య శైలులుగా అనుకూలించ బడినాయి.
(అయితే- గుర్రపు స్వారీ , మల్ల యుద్ధము వంటివి సైనికులు, రాజ వర్గము వఱకే
పరిమితమైనాయి.)

ప్లేటో ఉవాచను గమనించండి...
"ప్రాచీన కాలములోని గ్రీకు కావ్యములలో,
కొన్ని కథలు విపరీతముగా ఉన్నవి. వాటిలో కొన్నింటిలో-'తల్లిని దండిస్తూన్న తండ్రి,
వివాహ సమయములో మీకు దీవెనలు ఒసగిన దేవుడు, స్వయంగా కుమారుణ్ణే వధించుట'ఇలాంటి
వానిని సర్వత్ర నిషేధించాలి. ఇలాంటి రూపకములను, నాటకములను ప్రదర్శించ రాదు."{*1}
ప్లేటో వాక్కులు గుర్తించండి...
"ప్రాచీన కాలములో ఏమి జరిగెనో, మనకు
తెలియదు. ప్రపంచములోని మనమంతా అసత్యాన్ని సాధ్యమైనంత వఱకు "సత్యము" వలెనే భాసింప
జేసి, ఉపయోగించు కుంటున్నాము" అంటూ, ప్లేటో "పౌరులలో సాత్విక, సమ శీలతలను పాదు
కొల్పే అంశాలనే స్వీకరించాలని" అభిప్రాయ పడ్డాడు.
"మన రక్షకులు,యదార్ధంగా దైవ
భక్తులై ఉండాలలి" మనము ఆకాంక్షిస్తున్నాము. అందు వలననే, ఇలాంటి నిషేధిత విపరీత
సంఘటనలను ఉపాధ్యాయులు గమనించి, వాటిని బాలలకు చెప్పరాదు. బాల బాలికల సుశిక్షణ కోసము
అలాంటి దృశ్యాలను ఉపయోగించరాదు. వీటిని ఎల్లప్పుడూ శాసనల వలెనే పాటించ వలెను.
దేవతల యందు, తల్లిదండ్రుల పట్ల
భక్తి ప్రపత్తులను ప్రజానీకంలో నెలకొల్పే దిశగా, ప్రాచీన కావ్యాలలోని అంశాలను
పరిగ్రహించాలి. మన దేశంలో వలెనే, అనేక ప్రాంతాలలోని ప్రజలు ఆయా సీమలలోని వారికి,
సముచిత ఆచారాల ద్వారా సమున్నత సమాజాన్ని అందీయ గలిగిన వారిని ఎంచుకుని,
ఆరాధిస్తూంటారు. ఆదర్శ వ్యక్తిత్వం కలవారిని,"దైవ స్థానము"లో ప్రతిష్ఠించి,
పూజిస్తారు. "ఎలాంటి వ్యక్తిత్వం
కలవారిని దేవునిగానూ, లేక దేవతలకు ప్రతి రూపములుగానూ స్వీకరించి అర్చిస్తారు?"అనే
విషయం, ఆయా ప్రజానీకపు హృదయ సంస్కృతీ, సంస్కార విస్తృతిపైన ఆధారపడి,
విస్తరిల్లుతుంది .
సాధారణంగా పురుషోత్తముల గాథలే ప్రచారాన్ని పొంది, క్రమంగా వారే
ఆరాధ్యనీయులౌతారు. కాలక్రమేణా ప్రజాబాహుళ్యము యొక్క మూర్తిమత్వములను, ప్రవర్తనా సరళినీ రూపొందించగలిగిన"అజ్ఞాత కారణాల ప్రభావం"గా వారి ఆదర్శ వ్యక్తిత్వాలే
శాశ్వతంగా అలరారుతూంటాయి. ఇలాటి
హేతువుల సంపుటియే "ప్లేటో అద్భుత భావ వల్లరి". ఆ గ్రీకు గురువు అధ్యాపకుడు అంటాడు కదా,"తప్ప త్రాగుట, రహస్య కామములు, ధన లుబ్ధత, పేరాస, లంచములు వగైరా కార్య
కలాపములు, ఇట్టి గుణములను దేవతలకు, ఉత్తమ పురుషులకు ఆపాదించ రాదు."సహజమే కదా!
ఇలాంటి సర్వ సద్గుణాలతో విలసిల్లే విలాస పురుషులను "ప్రతి నాయకులు"(విలన్లు)
అవుతారు గానీ, "కథానాయకులు"(హీరోలు) గా ఎలాగ పరిగణించ గలము? ఇలాంటి సంస్కారమే"శ్రీ
రామచంద్రుని వంటి పురుషోత్తములను 'దైవములు' గా ప్రజలు కొలిచేటట్లు చేసినది కదా!"
ప్లేటో నిర్దేశనలో చదువు......
విద్యను ఆరంభించినప్పుడు, వర్ణ సమామ్ణాయము
అంతా నేర్పించవలెను.అక్షరములు ఎలాంటి కలయికలో ఉన్నప్పటికీ, ఏ ప్రమాణములతో ఉన్నా, ఆ సారాంశాన్ని గ్రహించగలిగినప్పుడే, సంతృప్తిని పొందగలుగుతాము. అంతే గానీ, వర్ణాలు, లిపి చిన్నవా? మరి పెద్దవా? అని చూడము. కనిపించిన చోట నెల్లా వాటిని చదవడానికి యత్నిస్తాము. అక్షరములు, నుడులు ఎక్కడ గోచరించినప్పటికిన్నీ, అవ్వానిని గుర్తించ గలిగినప్పుడే కదా! పఠన యోగ్యత సిద్ధించినట్లు?
ప్లేటో తను ఉన్నట్టి ఆనాటి సమాజంలో"దేశాన్ని పరిపాలించే చక్రవర్తులను సత్ప్రవర్తన కలవారినిగా తీర్చిదిద్దే సద్విద్య కావాలని" అభిలషించాడు. భవిష్యత్ పాలకులైనా సరే! మన వద్ద శిక్షణను పొందేటప్పుడు, వారిలోని ప్రధాన లోపాలు, ఏ సంశ్లిష్ట రూపాలుగానో ఎక్కడ
గోచరించినపటికిన్నీ; చిన్న పెద్ద వానిలో కనిపించినప్పటికిన్నీ, వాటిని, అనగా
ప్రవర్తనాపరమైన లోపాలను అలక్ష్యము చేయరాదు. అంటే, రేపటి పాలకులుగా ఉంటూ, ఈనాడు విద్యార్ధిగా వచ్చిన బాలురిలోని లోపాలను ఉపాధ్యాయుడు గుర్తించాలి. అవన్నీ సంస్కరించ బడాలి. సత్ప్రవృత్తి , ఒకే కళకు, శాస్త్రానికి చెందినవనే విశ్వాసాన్ని పొందనంత
వఱకూ, వారిని అంటే భవిష్యత్తులో పాలకులుగా మార బోతున్న విద్యార్ధులను 'విద్యా
సమగ్రత, ఉత్తీర్ణతలు' పొంద లేదనే భావించాలి.
విద్యార్ధులు, యువకులు"సంగీతసాహిత్యాలను అభ్యసించాలి. అలాగే అంతే
ప్రాధాన్యంతో వారు అభ్యాసం చేయవలసినదీ వ్యాయామమును కూడా!"అంటూ దేహ దారుఢ్యము కొరకు పొందవలసిన క్రమశిక్షణ ప్రాధాన్యత గురించి కూడా నొక్కి వక్కాణించాడు. ప్లేటో వ్యాయామము,శరీర దారుఢ్యము యొక్క ఆవశ్యకతను గుర్తించిన గురువు. శారీరక పరిశ్రమను గురించి ప్లేటో ఎంతో విపులంగా చర్చించాడు. జైత్ర యాత్రలో తిండి మార్పులు, నీటి మార్పులు ఉంటాయి. అన్ని రకాల మార్పులకు యువకులు తట్టుకో గలగాలి, వేసంగి వెట్టకు
ఉడికి పోవాలి. చలిలో 'ఇవానికి '(శీతలత్వానికి)కొంగర్లు తిరిగి పోవాలి. అలాంటి
స్థితిలో కూడా వారు అనారోగ్యం పాలు కా కూడదు. "వ్యాయామ క్రీడాకారులకు
నిద్రమత్తు, సోమరితనము పనికిరాదు. ఉత్తమ వ్యాయామము ఆరోగ్యమునూ, దేహ దారుఢ్యాన్నీ పరిఢవిల్ల జేస్తుంది. ప్రజానీకము అందరికీ గరిష్ఠమైన సుఖము లభ్యము కావాలి. ఇదే మన ప్రధాన లక్ష్యము." స్త్రీల గురించి పాశ్చాత్య దేశాలలో ప్రముఖస్థానాన్ని ఏర్పరచగలిగినటువంటి దార్శనికుడు ప్లేటో. మహిళల విద్య గురించి ప్లేటో వ్యక్తీకరించిన అభిప్రాయాలను గమనించండి. "స్త్రీలు, బాలికలు కూడా గుఱ్ఱపు స్వారీని, యుద్ధ విద్యలను అభ్యసించాలి. వనితా మణులు కూడా సైన్యములో ఒక భాగముగా చేరినా, దాని పశ్చాద్గత శ్రేణిలోచేరినా, సైన్యానికి వారే అండ దండలు ఔతారు. స్త్రీలు కూడా పాల్గొనిన యుద్ధవ్యూహాల వలన, శత్రువులకు వారే సింహ స్వప్నమౌతారు. అలాంటి సైనికులే శత్రు భయంకరులు ఔతారు. అట్టి సైన్య బలగమే రిపులకు గుండెల్లో దడ పుట్టిస్తుంది. తత్వవేత్తలు అధిపతులుగా, రాజులుగా ఉంటే మేలు జరుగుతుంది."అని భావించాడు ప్లేటో. అందుకనే ఆ
మహాశయుడు, తన ఆదర్శసామ్రాజ్య చిత్రీకరణలో అతివలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాడు. మహిళలకు ఎంతో ప్రముఖస్థానాన్ని ఇచ్చిన ప్లేటో సుభాసితములు:
"చెప్ప వలసినది ఉన్నది కనుకనే మాట్లాడుతాడు వివేకి. ఏదో ఒకటి చెప్పాలని మాట్లాడుతాడు అవివేకి."అని నిర్వచించిన ప్లేటో వాక్కుల మహోద్గ్రంధమైనట్టి"ది రిపబ్లిక్"లోని ప్రతి అభిప్రాయ సుమమూ నిత్యోన్మేష పరీమళ భరితమే! ప్రతి ఉద్దేశ్యమూ నవ్య శ్వేత కిరణ బిందువునుండి ఉత్పన్నమౌతూన్న ఉజ్జ్వల ఇంద్ర ధనుస్సుల ఆకర్షణీయమైన వర్ణములే!

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...