2, జులై 2011, శనివారం

జాలి గుండె (కథా రూపకం)

























                                          సౌందర్య కాంతులతో భాసిల్లుతూ, వైభవంగా విలసిల్లుతూన్న వైకుంఠము అదిగో! అల్లదిగో!
ఆ నగరి లోపల,
ఆ సౌధాంతరమందున
ఆ నిత్య నూతన దంపతులు ఆటలో లీనమై ఉన్నారు.
లోకములను ఆడించే వాడు నారాయణుడు,
ఎల్ల ప్రజలకూ ఆసక్తిదాయకమై, పూజించబడుచున్న శ్రీ లక్ష్మీ దేవి,
ఇరువురి క్రీడ రసకందాయ రంజనమై సాగుతూన్నది.
ఎందరో జీవిత గమనాలనో మార్చిన “పాచికల ఆట” అది.
ఉభయుల ద్యూతక్రీడకు చిన్నపాటి అంతరాయన్ని కలిగించింది
నారద మహాముని సుస్వర నినాద భజన.
“నారాయణ! నారాయణ!”
చిద్విలాస వదనములతో, భార్యా భర్తలు సుంత ఆగి, ఇటు దృష్టి మరల్చారు.
“ఆడించేదీ నీవే!
అందరితో ఆడే వాడివి నీవే!
లీలా మానుష సూత్రధారీ!
నారద మానస సుధా ఝరీ విహారీ!
ఆదియు, అంతము లేని వాడా!
అంతట నిండిన వాడివి నీవే!
నా హృదయ డోలలో ఊగగ రావోయీ!
నారాయణ! నారాయణ! ”
క్షీర సాగర కెరటాల నురుగులు
నారదుని చరణాలనూ, దుస్తుల అంచుల పైన పడుతూన్నాయి.
“నారద చంద్రమా! సుస్వాగతము మౌనీశా!”
“నమస్సుమాంజలులివే తాత గారూ! క్షీరాబ్ధిని చూస్తూంటే, అనిపిస్తూన్నది, దేవా!”
నారాయణుడు అడిగాడు
“ఏమని అనిపిస్తున్నది మౌనీంద్రా!”
“భూలోక వాసులు ఉష్ణ పానీయాలను ఉదయ వేళలలో నిత్యమూ సేవిస్తూన్నారు.
ఈ సారి నేను టీ, కాఫీ పొడి ద్రవ్యాలను తెస్తాను,
ఈ పాలు కలిపి, కొత్త పానీయాన్ని మీకు కూడా రుచి చూపిస్తాను, నానమ్మా!”
‘తనను కూడా పలుకరించ లేదే!?
ఈ మనుమడికి స్త్రీలు అంటే తగని ఉపేక్ష కదా! ’
అని మనసులో రవంత కినుక మొలకెత్తింది,
ఆమెకు.కోపం చిటికెలో మంత్రం వేసి తీసినట్లు పోయింది,
ఇందిరా దేవి .దరహాసనన ఐ, ఆశీస్సులను ఒసగుతూ, పలకరించినది,
“చిరంజీవ! సుఖీ భావ! నారదా!”
శ్రీ పతి, విష్ణు మూర్తి అడిగాడు
“ ఏమి నారదా!! ఏమిటి విశేషాలు? ఊరక రారు మహానుభావులు!?!
భూ లోకం నుండి ఎలాంటి సమాచారములను మోసుకు వచ్చావు ఋషివరా!”
“ మోసుకు వచ్చినవి మాత్రం ఇవిగో!
ఈ చిరుతలూ, తంబురా !
తీసుకు వచ్చిన వార్తలు మాత్రం కో కొల్లలు.”
“ఆహా! ఐతే  ఆ వార్తలనే వాటిని నా చెనిని వెయ్యి స్వామీ!” అన్నాడు శ్రీ పతి.
శ్రీ నాథుడు పృచ్ఛకుడు, అవధాన ప్రియత్వము త్రిలోక సంచారి నారదునిది.
కుతూహలతతో మిళాయించిన ఆ క్వశ్చన్ కు బదులు ఇచ్చాడు త్వముని.
“కుప్పించి, ఎగసి దూకే కుండలముల కాంతితో విరాజిల్లే
ఆ నీ శ్రవణేంద్రీయాలలో నీ చెవులలో
పుంఖానుపుంఖాలుగా ఉన్న ఊసులను చెప్ప గలగడం నా భాగ్యమే స్వామీ!
చెప్పడం మొదలు పెట్టాక యుగాలు, కల్పాలూ పట్ట వచ్చును దేవరా!
కానీ మీ దంపతుల పాచికల ఆటకు నడి మధ్యలో భంగము కలిగించిన వాడిని ఔతానేమో!”
నారాయణుడు మందస్మితాననముతో వక్కాణించాడు.  
“క్రీడా భంగం కాబోదులే  ఋషీంద్రా!”
“అహ! మాతామహి పద్మాలయకు మీ పైన ఆగ్రహము రావొచ్చునేమో!?!-
స్వామి వారికి నా మీద కంటే ఈ జడలమారి మనవడి మీదే మక్కువ ఎక్కువ ఐనదే- అని!”
అని అంటూ త్రిలోక సంచారి ఆమె వంక చూసాడు.
రమా దేవి నవ్వుతూ అన్నది “అప్పుడే తగవులు పెట్టడం మొదలు పెట్టావా కలహ భోజనా!
జగన్నాటక సూత్ర ధారి మీ పితామహులు! అనంత విశ్వాన్నే నియంత్రించే శ్రీ పతికి –
ఈ చిన్న ఆట ఒక లెక్కలోనిదా!
తానే గనుక తలచు కుంటే నీతోనూ, మరి నాతోనూ ఏక కాలంలో ఆడ గలరు”
“సత్యం! సత్యం! పునః  సత్యం! అమ్మా! శ్రీ క్రిష్ణావతారము రోజులప్పుడు – నీతో పాటు పదహారు వేల మంది
రమణీ మణులతో రాస క్రీడలు ఆడిన వాడు – ఆ లీలా మానుష క్రీడా లోలుడే కదా అవ్వా!” అన్నాడు
నారదుడు.
విష్ణు పత్ని అధరాలు వణకగా, బుంగ మూతి పెట్టి పలికింది
“ఇప్పుడవన్నీ జ్ఞాపకం చేసుకోవడం ఎందుకులే మౌనీంద్రా!”
వెను వెంటనే సతి వాగ్బాణాలను అందుకుని,
తటాలున వైకుంఠ వాసుడు, తడబాటుతో అన్నాడు
”ప్రస్తుతము ఆ అప్రస్తుత విషయాల ప్రశంసలు ఎందుకయ్యా కలహాశనా!
మనుజ లోకపు విశేషాలను – ఏదీ…. కాస్త పూస గుచ్చినట్లుగా చెప్పు చూద్దాం!”
ఆ తాతయ్య అభ్యర్ధనను కాదన గలడా ఈ మనుమడు!
“అమ్మమ్మమ్మా! ఏమని వివరించగల వాడిని నేను!
ధర్మ దేవత ఒంటి పాదము మీద నిలబడి, ఆక్రోశిస్తూన్నది.
ఎక్కడ చూచినా అధర్మమూ, అసత్యమూ, అశాంతీ,
ప్చ్! అంతః కలహాలున్నూ.
నారాయణ! నారాయణ! పెదవులకు అలవి కాదు వివరించడానికి.”
“అంత ఎక్కువగా ఉన్నాయా?” నారాయణుని మోముపై ఉద్భవిల్లినది ఒక ఆశ్చర్యార్ధకము!!!!!
బ్రహ్మ మానస పుత్రుడు – సంభాషణను ఇంకా కొనసాగించాడు
…. కాంతా కనకాల కోసం మారణ హోమాలు,
ధన ధాన్యాల కోసం దారుణ కృత్యాలు,
పిడికెడు బియ్యం కోసం పెనుగులాటలు,
అందని పదవుల కోసం పైశాచిక కృత్యాలు,
స్వార్ధంతో ధన మదాంధుల పరవళ్ళు,
క్రుద్ధతతో క్షుద్భాధితుల కలరవాలు,
భాగ్యవంతులు తమ కుక్క పిల్లలకు విందులు చేస్తుంటే –
నిరుపేదలు పుల్లి(వి)స్తరాకుల కోసం
ఊర కుక్కలతో కొట్లాడుతూంటారు”
“పాపం!” జాలి పడుతూ అన్నారు రమా రమణుడు, ఆయన పత్నీ.
మళ్ళీ నారదుడు అందుకున్నాడు ఇలా,
“మురుగు కాల్వల పక్కన పందుల కంటే హీనంగా పొర్లాడుతున్నారు.
చి చీ ఛీ!ఛీ!! వాళ్ళను చూడాలంటేనే పరమ రోత!”
“ఏమిటి నారదా! వాళ్ళను చూసి, జాలి పడవలసింది పోయి,
ఏవగించుకుంటున్నావా!?,”
మురారి విభ్రమంగా అన్నాడు.
“జాలి పడాలా! వాళ్ళకి పని చేసుకుని సుఖంగా బతకడం తెలీదు.
కష్ట పడటం ఇష్ట పడని సోమరి పోతులు.
అడుక్కు తింటూ మట్టిలో పొర్లాడుతూండడంలోనే వాళ్ళకి సుఖం ఉంది.”
దేవర్షి ఆవేశం అది.
“అన్నట్లు నారదా! నా భక్తుడు వెంకట క్రిష్ణుడు ఎలా ఉన్నాడు?”
భూలోకంలోని తన భక్తుని గురించిన జిజ్ఞాసతో నారాయణ మూర్తి క్వశ్చన్ మార్క్.
“ఏ వేంకట క్రిష్ణుడు?……
ఓహో! …….
ఆ …… సత్య సుందర వీర గోవింద అచ్యుత జనార్దన వెంకట క్రిష్ణ స్వామేనా?”
ఆయాసం తీర్చుకుంటూ,
“నిక్షేపంగా ఉన్నాడు, తమ దయ వలన కోటికి పడగలెత్తాడు”
“కోట్లకు పడగలెత్తాడో, కాటు వేయడానికి పడగలెత్తాడో గమనించాలి నారద మునివర్యా!”
“లేదు స్వామీ! అయినా తమ భక్తుడు కదా!
విషపు బుసలను ఎందుకు కొడతాడు?” కొంచెం నసుగుతూ పలికాడు సరస్వతీ పుత్రుడు.
“మనిషి విపత్తులలో ఉన్నప్పుడు
భగవంతుడనే మహా వృక్షం భక్తి
అనే తరు ఛాయలలో తల దాచుకొన జూస్తాడు.
కానీ ఆ నీడలో ఆశ్రయానందం లభించగానే
ఈ మహా పాదపం సర్వం తన స్వంతమనే అహము కలుగుతుంది.
సర్వం సహా తన హక్కులే అనే ఆభిజాత్యంతో, మద గర్వంతో విర్ర వీగుతాడు.
చివరికి భూరుహము యొక్క ఫల పుష్పాదులే కాకుండా,
శాఖా, మూలములను కూడా అనుభవించే ఆశ ఆక్రమిస్తుంది.
ఫలితంగా స్వార్ధపూరితుడై, పవిత్ర వృక్షమును నిలువెల్లా అమ్ముకుని,
వ్యాపారం చేయాలని యత్నిస్తాడు ”
అనర్గళంగా సాగింది ఆ నీల మోహన స్వామి వాక్ప్రవాహము.
వెంటనే నారద ముని “ఐతే ఆ సత్య సుందర వీర …….
హ్! ఎందుకు లెండి?
ఆ వెంకట క్రిష్ణయ్య కూడా ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నాడంటారా?” అడిగాడు.
“ఏమో? నువ్వే వెళ్ళి చూడు! నీకు మూడు నెలలు గడువు ఇస్తున్నాను.
నీ దేవత్వాన్ని కొద్ది కాలము పాటు ఉపసంహరిస్తున్నాను.
నీవు ఆ మనుషులలో ఒక మనిషిగా సంచరించి,
వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకో!”
అంటూ, శ్రీ మహా విష్ణువు నారదుని భూలోకానికి వెళ్ళమని చెప్పాడు.
“శేష శయనా! ఈ మహదవకాశాన్ని
నాకు ప్రసాదించినందుకు, ధన్యుణ్ణి!
ఈ సరి కొత్త అవకాశం నిఖిల లోక కళ్యాణానికై వినియోగపడును గాక!
కానీ…. స్వామీ!…….”
“ఊ! కానీ….. ?” అర్ధోక్తిలో ఆగిన ఋషీంద్రుని అడిగాడు పాల కడలి వాసుడు.
“మరీ…… క్షీరాబ్ధి వాసీ!
నాకు అవసర సమయాలలో నాకు అండగా నిలబడతానని
తమరు నాకు మాట ఇవ్వాలని నా మనవి.
అలాంటి మానవారణ్యంలో మెలగడానికి నాకు ధైర్యం వస్తుంది”
“పైగా ఇదొకటా! సరే! అటులనే!”
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అభయము  నిచ్చాడు.
“ధన్యోస్మి దేవరా! అభయ వర ప్రదాతా!
నాకు కొండంత అండగా నీవుంటే  మహా పర్వతాలను సైతం
ఇట్టే ఢీకొనగలను. నారాయణ! నారాయణ!”
తత్క్షణమే నారాయణుడు ఒసగిన నరుని వేషం సంప్రాప్తమైనది.
భూ లోకంలో వ్యవసాయ క్షేత్రంలో ఒకడు నేలను దున్నుతున్నాడు.
ఆ పొలంలో సాగు చేస్తూ పాటుబడుతూన్న వాడే నారదుడు.
“హెయ్! హెయ్!” కాడెద్దులను అదిలిస్తూన్నాడు,
కానీ అవి అతని మాట వినట్లేదు.
“హెయ్! హెయ్! వీటి దుంప తెగ! ఈ ఎద్దులు మాట వింటే గదా!
క్రిష్ణ! క్రిష్ణ! ఈ కష్టాలు పగ వాళ్ళకు కూడా వద్దు నాయనా!”
అస్సురుస్సురంటూ చతికిల బడ్డాడు.
ఎట్ట ఎదుట శ్రీ కృష్ణుడు ప్రత్యక్షమైనాడు.
“అలసి పోయావా నారదా!?”
తేరి పారా చూస్తాడు నరునిగా ఉన్న్ నారదుడు.
“నా నోట్లో మాట నోట్లో ఉండగానే సాక్షాత్కరించావా భక్త వత్సలా!
అ…. ఇదేమిటి స్వామీ! మళ్ళీ క్రిష్ణావతారం దాల్చావు,
ఇది ద్వాపర యుగం కాదు కదా?”
మందహాసం చేసాడు క్రిష్ణుడు
“కాదు నారదా! ప్రస్తుతం నువు కలియుగంలోనే ఉన్నావు.
వేంకట క్రిష్ణుని పొలంలోనే సేద్యం చేస్తూ నా ప్రక్కనే నిలబడి ఉన్నావు”
“అహా! క్రిష్ణయ్యా!!!!! నువ్వు నా పక్కన ఉంటే
వేంకట క్రిష్ణుని మాగాణి పొలాన్నే కాదు,
గిరిజా, గంగా పతి బంజరు భీడు భూములనైనా సరే!
ఇట్టే చిటికెలో దున్నీసేయగల్ను.
అది సరే గానీ స్వామీ!…………..
తాము ఇప్పుడిలాగ శ్రీ క్రిష్ణావతారం ఎత్తారెందుకని? గోవర్ధనోద్ధారా!”
“నీ  అంగుళీ వాయిద్య వాదనము సమ్మోహనంగా ఉంది.
ఏదీ, మరొక్కసారి చూపించు విరించీ పుత్రా!”
ఆది విష్ణువు పృచ్ఛ అది.
“అంగుళీ వాద్యమా? … ఆహా! వ్రేళ్ళతో చిటికెలు వేయడమా?
ఇదిగో, ఇలా బొటనవేలును మధ్య వేలుతో తాటిస్తూ, రాపాడిస్తే,
చిటికెలు వస్తాయి. చిటికెలు వేసే విద్య ధరణిజులకు వెన్నతో పెట్టిన విద్య. ”
నారద వాక్కులు.
“వ్రేపల్లెలో లాగా మళ్ళీ నవనీతం తినాలని అనిపించేలా చేస్తున్నావు, నారదా!”
“మాట మార్చి, నన్ను ఏమార్చి, బులిపిస్తూన్నావు, స్వామీ!
ప్రస్తుత అవతార అవతరణా రహస్యాన్ని విడమరిచి చెప్పండి.”
“ అదా?! ‘యే యథా మాం ప్రపద్యంతే; తాం స్తథైవ భజామ్యహం||’
ఎవరెవరు ఏయే రూపాల్లో నన్ను కొలుస్తారో వారిని ఆ విధంగానే ఆదరిస్తాను.
నువ్వు నన్ను ‘కృష్ణా! కృష్ణా!’ అని తలిచావు కదా!
అందుకనే నీకు క్రిష్ణునిగా సాక్షాత్కరించాను,
ఇదీ ప్రస్తుతాలంకారం. అదే ‘రామా! రామా!’అని తలిస్తే …….
శ్రీరామ చంద్రునిగా నీ ముందర నిలిచి ఉండే వాణ్ణి.”
“వద్దు,వద్దు స్వామీ రామావతారంలో జానకీ నాధునిగా
ఏకపత్నీ వ్రతంతో ఏ మాత్రం సుఖపడ్డావు గనుక!!!
గోకులంలో చిలిపి ఆటలు ఆడి, అష్ట మహిషులతో కూడి,
వైభోగాలతో తులతూగిన నీ క్రిష్ణావతారమే నయనానందకరమూ,
హృదయానంద సమ్మోహన కరమున్నూ! శిహిపింఛధారీ!
ఆ క్రిష్ణావతారమునే నేత్రపర్వదాయకముగా ఉండనీవయ్యా!”
మైమరపుగా నొక్కి వక్కాణిస్తూ
పలుకుల పందిరి ఐనాడు ఆ సుర మౌని.
“ఐతే శ్రీ కృష్ణునిగా – నీకు ఆ విషయంలో మాత్రమే ఆదర్శం అయ్యానన్న మాట!”
నారదుడు వెనక్కి తిరిగి చూసి , గాభరాగా పరుగులు తీసాడు.
“అయ్య్! అయ్యొ! అయ్యయ్యో! ఎడ్లు బురదలో పొర్లాడుతూన్నాయి.
ఛి ఛీ! ఇప్పుడెలా? వాటితోటే పొలం దున్నాలి.”
క్రిష్ణ రూపంలోని విష్ణు మూర్తి సముదాయిస్తూ అన్నాడు
“బెంబేలు పడకు త్రి లోక సంచారీ!
కొంచెం తాలిమి తాలిమి వహించు!
ఎద్దులను ఆ కాలువలో కడిగి, శుభ్ర పర్చి, తెస్తాను. ”
“ఆ! ఔరా! విచిత్రము!” నారదుడు ఆశ్చర్యంతో
నోరు ఆవలించి, చూడ సాగాడు.
జడ ధారి అలాగ విభ్రమావథలో ఉండగానే,
మురళీ, పింఛధారి గేదెల జతను బాగా పరిశుభ్ర పరచి, తీసుకు వచ్చాడు.
“చూడు! ఎలా కడిగానో????”  అడిగిన వాడు క్రిష్ణుడు.
“ నీ చేయి పడినాక, ఈ వృషభ ద్వయం – చెప్పక్కర్లేదు-
ఆహా! నిజంగా ఆణి ముత్యాలల్లే మురిపంగా,మెరిసి పోతున్నాయి.”అన్నాడు.
“నారదా! నువ్వు బాగా అలసి పోయావు.
కాస్సేపు అటు కూర్చుని, విశ్రాంతి తీసుకో!
నేను ఈ భూమిని దున్నుతాను.”
“ఛ్! ఛ్! వద్దు స్వామీ!”కంగారుగా అన్నాడు నారదుడు.
“ ఫర్వా లేదులే! కూర్చో! నారదా! చూస్తూండు!
ఒక్క అర గంటలో అరక దించేస్తాను గదా!”
ఆ స్థిత ప్రజ్ఞుని పల్లవాధరాల నుండి స్నిగ్ధంగా వెలువడినాయి .
“ స్వామీ! భక్త వత్సలా! ఈ నారదుని వలన నీకు ఎన్ని పాట్లు వచ్చాయి.
దేవా! ఒక జడ ధారి కష్టాలలో పాలు పంచుకోవడానికై ఇచ్చోటికి దిగి వచ్చావు గదా!”
అంటూ స్తోత్రం చేసాడు.
“నారద మునీంద్రా! వాటిని అలా అదిలిస్తే మాట వినవు.
వాటిని కూడా సాటి ప్రాణి లాగా వాత్సల్యంతో పోషించాలి.
ప్రతి రోజూ నా  అశ్వాలను నేనే స్వయంగా మర్దనలూ,మాలీసులూ చేసే వాడిని.
వాటికి నేనే గుగ్గిళ్ళు, ఆహారము పెట్టేవాడిని.
అందు వలననే అవి నా కను సన్నలలో మెలుగుతూండేవి.
నా నేత్ర సంజ్ఞలతోనే ఆ జవనాశ్వాలు వాయు వేగంతో పరుగులు పెట్టేవి.
కనుకనే నేను పార్థ సారధిగా ప్రఖ్యాతి వహించ గలిగాను.” కృష్ణుని వాణి మృదు మధురము.
“అర్ధమైనది స్వామీ! నిన్ను కేవలం గోపికాలోలునిగానే ఆదర్శంగా తీసుకున్నాను.
నా అజ్ఞానాన్ని క్షమించు. నా కళ్ళు తరిపించినావు.
అర్జునుని అనంతరం గీతా రహస్యాన్ని నాకు సాక్షాత్కరింప జేసినావు.
ధన్యోస్మి! ధన్యోస్మి! ” తన్మయుడౌతూ
భక్తి పారవశ్య మానసముతో చేతులు జోడిస్తూ అన్నాడు ముని.
“మరి భక్తి మత్తులో శ్రమ సిద్ధాంతాన్ని గాలికి వదిలేస్తావా? ”
శ్రీ క్రిష్ణ ప్రశ్న అది.
“మర్చిపోలేదు స్వామీ!
మళ్ళీ ఈ రేగడి నేలలో విత్తులు చల్లాలి, నారు పోయాలి”
వెళుతూ అన్నాడు క్రిష్ణ భక్తుడు.
“శుభం! అయితే ఇప్పుడే మొదలు పెట్టు”
ఆ పలుకులు వినీ వినగానే నారదుడు కృషీవలునిగా మారాడు,
తన పని తాను చేసుకు పోతున్నాడు.
“అలాగ నిశ్శబ్దంగా చేసుకుంటూ పోవడానికి
ఇది మౌని కర్మ కాదు. నారదా!
ఇది వ్యవసాయము. నేను కూడా సాయపడనా?
పాట పాడుతూ పని చేయి! అపుడు ఉత్సాహంగా ఉంటుంది”
“సరే స్వామీ! అలాగే!
నువ్వు నన్ను కాస్తంత అవలోకిస్తూంటే చాలును”
గోపాలుని మాటలకు బదులు చెప్పాడు నారదుడు.
నారదుని గళము శృతి పోసుకున్నది.
“ నారద మానస డోలా విహారీ!…..”
అని ఆరంభించాడు ఆ ఋషివరేణ్యుడు.
“ఆ! ఆ! పొలం పని చేసేటప్పుడు అలాంటి పాట కాదు మునివర్యా! ఊ….
పని పాటులలో కులాసా పాటలు పాడాలి. విను!”
క్రిష్ణ గానంతో పరిసరాలు పులకిస్తూన్నాయి.
“వానల్లు కురవాలి వాన దేవుడా!
వరి చేలు పండాలి వాన దేవుడా!
దుక్కుల్లు దున్నాలి వాన దేవుడా!
విత్తుల్లు చల్లాలి వాన దేవుడా!”
క్రిష్ణ మూర్తి  అతనిని ఉల్లాసపరుస్తూన్నాడు.
ఇంతలో నారదుడు బిగ్గరగా అన్నాడు
“అదిగో! అడుగో!  యజమాని వస్తున్నారు”
“ఎవరు? ఆ నామాల వ్యక్తేనా?”
“ఆ!ఆ! ఆ నిలువు నామాల మనిషే!
పూర్వం భక్తిపూర్వకంగా, దైవ  చిహ్నంగా నామాలను తీర్చిదిద్ది పెట్టుకునేవాడు.
ఇప్పుడు భక్తి జలం ఇంకి పోయి, చిహ్నాలూ, మచ్చలూ మిగిలాయి.
ప్రస్తుతం ఎదుటి వారికి నామాలు పెట్టడానికి మాత్రమే పెట్టుకుంటూన్నాడు”
అన్నాడు నారదుడు.
“అయితే నీ అనుభవపరిపాకం బాగా గట్టిపడినట్లుగనే ఉన్నది!”
“సరే! నేను వెళుతున్నాను. నీకు అవసరమైనప్పుడు వస్తాను.” మాయమైనాడు.
క్షేత్ర యజమాని వెంకట క్రిష్ణయ్య వచ్చాడు.
“ఏంటయ్యా నారయ్యా!!!
దిక్కు లేని వాడిని  అంటూ కాళ్ళా వేళ్ళా పడి,
బ్రతిమాలావు కదా అని ఏదో జాలి పడి
నీకు పని ఇచ్చినందుకు బాగానే చేస్తూన్నావు నిర్వాకం!
హ్హు......!  పొలం దున్నడం, విత్తులు జల్లటం ఇలాగేనా?
నా మొహంలా ఉంది.” గగ్గోలుగా కేకలు వేసాడు.
నారదుడు ఒకింత భయంతో వినయంగా అన్నాడు
"విత్తనాలు చల్లడం – మీ మొహంలాగా ఉన్నదనే
విషయం నిజమే కావొచ్చు గానీ,
పొలం దున్నడంలో లోపాలను ఎంచకండి.
సాక్షాత్తూ ఆ దేవ దేవుడే దిగి వచ్చి దున్నాడు.
ఆ నాగేటి చాళ్ళను తిలకించండి………
పట్టు చీరకు నేసిన సరిగంచులకు మల్లే ఉన్నాయి కదుటండీ!!! ”
“నా మాటకే బదులు చెబ్తున్నావా?
చెప్పుతో కొట్టే వాళ్ళు లేకపోతే సరి? మాటకు మాట చెబుతావేం???
హన్నన్నా! పనిలో చేరి వారం రోజులు కూడా కానే లేదూ
అప్పుడే నన్నెదిరిస్తున్నావా? ”
అతడు రౌద్రంతో గంతులు వేయసాగాడు.
“బాబ్బాబు! అలా సెలవీయకండి.
నాకిప్పుడే తెలిసి వచ్చింది తమ బోంట్ల వద్ద ఎలా మెలగాలో;
ఇక నుండి తమరు నంది అంటే నందే, పంది అంటే పందే.”
“అంటే నేను అవాకులూ, చెవాకులూ పేల్తున్నాననే కదూ, నీ వ్యంగ్యం?
నీకూ, నీ పనికీ ఓ పేద్ద దణ్ణం. ఇక దయ చెయ్!”
“అయ్యా!అయ్యా!”నారదయ్య ప్రాధేయ పడ్డాడు.
“చెబ్తూంటే నీక్కాదూ! ఇక ఫో!
ఏ నిమిషాన వచ్చావో గానీ,
నా పని వాళ్ళందరికీ నేను అన్యాయాలూ, అధర్మాలూ  చేస్తున్నానని నూరిపోస్తున్నావు?!
పేనుపై జాలి పడితే తలంతా తెగ కొరికిందట!
అలాగ ఉంది నీ వ్యవహారం! ఫో! ఫో! ”
యజమాని ఉగ్రత్వాన్ని తలుచుకుంటూ, రోడ్డు మీద నడవ సాగాడు నారదయ్య.
“ పని కాస్తా ఊడింది. అర్భకావతారంగా ఉన్నానని
ఎవ్వడూ పని ఇవ్వడం లేదు. యాయవారమూ, ఉపాదానానికి వెళ్తున్నానా,
‘నీకు కాళ్ళూ, చేతులూ ఉన్నాయి కదా!
ముష్టెత్తుకోవడానికి సిగ్గు లేదూ!
పని చేసుకుని బతకరాదూ!
పనిపాటులు లేకుండా సోమరితనాన్ని మరుగుతున్నారు ఇలాంటి వాళ్ళు.’
అంటూ ఎవళ్ళూ ముష్టి కూడా వేయడం లేదు. ఆకలి దంచేస్తూన్నది.
అబ్బా! దాహం!”  అటూ ఇటూ చూసాడు, నల్లా అగుపడింది.
“హమ్మయ్య! అదిగో! అక్కడ జల దాయిని ఉన్నది.
నోరు పిడచ గట్టుకు పోతూంటే, వర్ష మేఘం వలే కనబడింది. అమ్మయ్య!”
వెళ్ళాడు నారయ్య.
అంతలో పోలీసు వచ్చి, అదిలించాడు.
“ఏయ్! ఎవరు నువ్వు? ఇది మునిసిపాలిటీ పంపు.
డబ్బులు కట్టకుండా తాగుతూన్నావేమిటి?
ముందర మనీ కట్టు, ఆనక కుత్తుక దాకా తాగు! ఎవరూ కాదన్రు.”
‘ఓహో! ఈ గొట్టమును పంపు అని పిలుస్తున్నారా?’
అని మనసులో అనుకున్నాడు నారదయ్య;
“ఏమిటీ పంచభూతాల్లో ఒకటైన
నీటికి కూడా మూల్యం చెల్లించాలా?
నా దగ్గర ఎర్ర ఏగాణీ లేదు. బాబూ!
దాహానికి డబ్బులు ఇవ్వాలని నాకు తెలీదు,
సరస్వతి తోడు అంటే మా అమ్మ తోడు.”
“తెలీదూ, గాడిద కొడకా!” పోలీసు  కోపంతో కొట్టాడు.
బీటు పోలీసు కొట్టిన దెబ్బకు
గింగిర్లు తిరుగుతూ నారయ్య కిందపడ్డాడు.
“కొట్టకు బాబూ! కొట్టొద్దు నాయనా!
నేను గాడిద కొడుకును కాదు, బ్రహ్మ కుమారుణ్ణి!”
“ఏందిరా వాగుతున్నావ్?!
ఐతే నువ్వు పిచ్చోడివన్న మాట!
వీడు పిచ్చోడు! తన్నండిరా తన్నండి!”
అంటూ ఆ భారత రాష్ట్ర రక్షక భటుడు
మళ్ళీ చపేటం ఇచ్చుకున్నాడు.
జనం కూడా తన్న సాగారు.
నారయ్య ఉరఫ్ నారదుడు కాలికి బుద్ధి చెప్పాడు.
“అమ్మా! ఎండ! కాళ్ళంటుకు పోతున్నాయి.
అదిగో! ఆ చెట్టు కింద నిలబడతను.”
అని అక్కడి ఒక తరు ఛాయలోఆగాడు.
ఆ తరు ఛాయలో కూరలు అమ్ముకుంటూన్న చిరు వ్యాపారి
“గయ్! గయ్ ”మంటూ తాడెత్తున గెంత సాగాడు.
“ఏయ్! ఎవర్నువ్వు? ఈ చెట్టు నీడ నాది.
నెల నెలా డబ్బులు కట్టుకుంటున్నా.
ఈ ప్లేసు (place) లో ఈ పూట ఉండే హక్కు నాకే ఉంది.
అర్ధమైందా?”
“అంటే భూరుహమ ఇచ్చే చల్లని నీడకు కూడా
మూల్యాన్ని చెల్లించాల్సిందేనా?
ఇదేం లోకం బాబోయ్,
ఆ ….. భూలోకం కదూ!…. హుష్!…..” నడవ సాగాడు.
“పైన తలా, కింద అరి కాళ్ళూ అంటుకుపోతున్నాయి.
ఎండ తీక్షణత – కలి యుగంలోని అధర్మంలా భగ భగ మంటున్నది.
ఆకలి! ఆకలి, దాహం… నాలిక పిడచ కడుతూన్నది.
అంటూ అక్కడికి అన్నం తెచ్చుకుని తింటూన్న బిచ్చగాడికేసి చూస్తున్నాడు.
“ఎవరయ్యా నువ్వు? అలా చూస్తూన్నావు.
ఆకలేస్తోదా? ఇంద! ఈ నాలుగు విస్తళ్ళనూ నువ్వే తీస్కోలే!” ముష్ఠి  వాడు ఇవ్వబోయాడు.
“ ఛి ఛీ, పుల్లిస్తరాకుల్లోదా? ఎంగిలీ మంగలం ! ”
నారదుడు ఛీదరింపులు.
“అయితే మరీ మంచిది.” అనేసి,
అక్కడ తచ్చాడే శునకాన్ని చూచిన యాచకుడు,
” చై ఛై ఎదవ కుక్క…” అని కసిరాడు.
మళ్ళీ కాసింత జాలి పడి, “జ్జు జ్జూ దా దా!” అని పిలుస్తూ
రెండు కడిలు/ ముద్ద వేసి, మిగతాది తాను తినేసాడు.
“ఇదిగో! సన్నాసయ్యా! నేను వెళుతున్నా!
కావాలంటే అదిగో! ఆ ఒటేలు (hotel)  కాడికి ఎళ్ళు!
కావలసినన్ని విస్తరాకులు దొరుకుతాయి.”
ఆ బిక్షాధికారి కాస్తా వెళ్ళి  పోయాడు.
“ ఊ …. ఉ…..హ్! ముష్ఠి వాడు
ఆ ఎనిమిది విస్తరాకుల్లోని మిగిలిన అన్నమంతా తినేసాడు.
పోనీ, నేను కూడా తినుంటే బాగుండేదేమో!
చి చీ! చీ! ఏమిటో పాడు ఆలోచనలు.
ఎంగిలాకులు తినే స్థాయికి దిగజీరుతోన్నది మనసు.
క్రిష్ణ క్రిష్ణా! నా మనో నిగ్రహాన్ని పరిరక్షించు పురుషోత్తమా!”
కనురెప్ప వేసేంత కాలంలో శ్రీ క్రిష్ణుడు ప్రత్యక్షమైనాడు.
“పిలిచితివా ?నారదా!” అన్నాడు.
“వచ్చావా తండ్రీ! భక్తజన మందారా!
ఆశ్రిత జన వత్సలా! తాపస, దీన జన రక్షకా!”
“నారదా! దండకం చాలు నాయనా!
దండ కేయూర భూషణాలూ, కాంచన కవచాలు …..
ఇలాంటి స్తోత్రాలకు కాస్సేపు కామా పెట్టు…..”
స్వగతంలో నారద ముని అనుకున్నాడు “కామానా? అంటే…”
నారాయణుడు కంటిన్యూ చేస్తూ ................
“…..  ఇప్పుడు చెప్పు! మునివరా!
చేయడానికి పని దొరకక
అడుక్కు తినడానికి దిగజారిన పేదవాడు అతను.
ఆతడి గురించి నీ అభిప్రాయం ఏమిటయ్యా? బొలొ,బోలో!” పృచ్ఛకునిగా మారాడు జగత్పిత.
సర్వాంతర్యామికి సకల భాషలూ తెలుసుననుకుంటూ –
ఆ ‘బాసల ’గురించి ఆశ్చర్య పడటము మానేసాడు త్రిలోక సంచారి.
“ధనవంతులు  భోగ భాగ్యాలతో తుల తూగుతూంటే
ఎంగిలి విస్తరాకుల కోసం కుక్కల కన్నా హీనంగా
బతుకుతూన్న దౌర్భాగ్యుడు పాపం! ”
తాపసి గుండె కరుణతో నిండిపోయింది.
“ఔను మరి! ఆతని గురించి జాలిపడాలే గానీ,
చీదరించుకోకూడదు, ఔను కదా!?”
“స్వానుభవం మీద తెలిసి వచ్చినది స్వామీ!
అయితే నాకీ గుణ పాఠము చెప్పకనే చెప్పడానికేనా ,
ఇంత నాటకాన్ని ఆడావు. నీ క్రిష్ణావతారము యొక్క ఆంతర్యము –
నిష్కామ కర్మ యోగమేననిన్నీ,
కర్మ సిద్ధాంత పరిపవతయే జీవన మార్గ లక్ష్యమనే నీతిని బోధపరిచినావు.
నీ లీలలు ఎవరికి ఎరుక తండ్రీ!”
“విధి విలాసము అంటే ఇదే నారదా!
సాక్షాత్తూ భగవత్ స్వరూపులకు కూడా వారి లలాట లిఖితములు
వారి నియంత్రణలో ఉండవనేది సర్వ కాల సత్య వచనము.
జీవిత మార్గానికి సురుచిర లక్ష్యాలను నిర్దేశించుకుని,
ముందుకు నడకను సాగించడమే మన అందరి కర్తవ్యము!”
శేషశయన మూర్తి అన్నాడు.
“ ఏది ఏమైనప్పటికీ నీ భక్త వాత్సల్యాన్ని సైతము
ఆస్వాదించిన భాగ్య శాలిని ఐనాను కదా,
దేవరా! ధన్యోస్మి! ధన్యోస్మి! ”
అంటూ నారద ముని తన మహతీ వీణను మీటుతూ, గానం చేయసాగాడు,
“నారద లీలా మానస డోలా…………”         
        [rachana ;-కుసుమ]
@@@@@@@@@@@@@@@@@@@@@@

     జాలి గుండె (కథా రూపకం) ;            విహంగ  (Link for story)                 Posted on 08/05/2011 by విహంగ


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...